08/06/2026
Member of Legislative Council, TJS Party-President, Former Chairman-TJAC, Political science prof-OU
08/06/2026
08/06/2026
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి గారికి అభినందనలు తెలిపిన ప్రొ.కోదండరాం
ఈరోజు ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సందర్భంగా హైదరాబాద్లోని నారాయణగూడలో నిర్వహించిన అభినందన సభలో శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాం గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొ.కోదండరాం గారు మాట్లాడుతూ నందిని సిధారెడ్డి గారి రచనల్లో, కవిత్వంలో తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మ ప్రతిబింబిస్తాయని అన్నారు. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, తెలంగాణ సమాజానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
నందిని సిధారెడ్డి గారికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
07/06/2026
ఎస్ఐఆర్ ప్రక్రియకు తగిన సమయం ఇవ్వాలి : ఎమ్మెల్సీ, టి.జే.ఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం
టి.జే.ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఎస్ఐఆర్పై వర్క్షాప్
హైదరాబాద్, జూన్ 7: రాష్ట్రంలో జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఆగమేఘాల మీద ముగించకుండా, కనీసం ఒక సంవత్సరం పాటు కొనసాగించాలని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. నాంపల్లిలోని టి.జే.ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఎస్ఐఆర్పై నిర్వహించిన వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి టి.జే.ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలీమ్ పాషా అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తికానుందని, కానీ ఈ సమయం సరిపోదన్నారు. కనీసం ఒక సంవత్సరం పాటు ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తేనే ఓటర్లకు తగిన అవకాశం లభిస్తుందని తెలిపారు. గతంలో ఎస్ఐఆర్ నిర్వహించిన రాష్ట్రాల్లో తగిన సమయం లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా లక్షలాది మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వివిధ కారణాలు చూపుతూ పౌరుల ఓటు హక్కును తొలగించే పరిస్థితులు తలెత్తకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని అన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణలో 68 శాతం మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఏ ఒక్క పౌరుడు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. టి.జే.ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకునేలా సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ వర్క్షాప్లో సామాజిక కార్యకర్తలు ఇర్ఫాన్ ఖాన్, అబ్దుల్ ఖాలిఖ్, మారియోస్ ఎస్ఐఆర్ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టి.జే.ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్, బైరి రమేష్, పల్లె వినయ్, నిజ్జన రమేష్ ముదిరాజ్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జస్వంత్ కుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం. నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, నాయకులు కొత్త రవి, ఎర్ర వీరన్న, పేరాల ప్రశాంత్, నరేందర్, రాజు ముదిరాజ్, వసీం అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
_______________________
05/06/2026
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కుల, మత, లింగ వివక్ష లేకుండా దేశ పౌరులందరికీ సమానంగా ఓటు హక్కు కల్పించారు. కానీ నేడు ఈ ఓటు హక్కు ప్రమాదంలో పడుతోంది. గత సంవత్సర కాలంగా దేశంలోని పలు రాష్ట్రాలలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పౌరుల ఓటు హక్కును హరించే పరిస్థితులను సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలోని 10 రాష్ట్రాలలో, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో SIR ప్రక్రియ ముగిసింది. దీంతో సుమారు ఆరున్నర కోట్ల మంది భారత పౌరుల ఓటు హక్కు పెండింగ్లో పడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం దేశంలోని ప్రజాస్వామికవాదులకు ఆందోళన కలిగిస్తోంది.
ఓటరు జాబితా ప్రక్షాళన పేరుతో జరుగుతున్న SIR ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటున్న వారిలో పెద్ద ఎత్తున పేదలు, మహిళలు, దళితులు, ముస్లింలు, అలాగే ఇతర సామాజిక వర్గాలకు చెందిన పౌరులు ఉన్నారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో తెలంగాణలో జరిగే SIR ప్రక్రియ పట్ల రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, పౌర సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఈ దిశగా తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో *జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో* “Special Intensive Revision (SIR)” అంశంపై వర్క్షాప్ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అఖిలపక్ష పార్టీల ప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు హాజరై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.
– *ప్రొ. కోదండరాం*
ఎమ్మెల్సీ & తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు
_______________________
05/06/2026
పరకాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాం గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా భూ సేకరణ ప్రక్రియలో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, భూ బాధితులకు తగిన పరిహారం, పునరావాసం కల్పించాలని కోరారు. రైతుల ఆందోళనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
_______________________
మిర్యాలగూడ : మానవ హక్కుల నేత పి. సుబ్బారావు గారికి నివాళులర్పించిన టి.జె.ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్
పి. సుబ్బారావు గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
04/06/2026
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు అంశంపై అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం సలహాదారు కే. కేశవరావు గారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాం, ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ పాల్గొన్నారు,
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి తదితరులతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, వారి సమస్యలు, సంక్షేమం మరియు వారికి అందించాల్సిన గౌరవం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉండేలా వివిధ రాజకీయ పార్టీలు తమ సూచనలు, సలహాలను కమిటీకి అందజేశాయి.
ఈ అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, టీడీపీ, తెలంగాణ జన సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
_______________________
04/06/2026
రాజకీయ విశ్లేషకులు ప్రొ. నాగేశ్వర్పై జరిగిన కక్షపూరిత దాడిని ఖండిస్తూ సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాం గారు పాల్గొన్నారు..
_______________________
02/06/2026
*ప్రొ.కోదండరాం గారిని సన్మానించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు*
అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభలో శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాం గారిని ఘనంగా సన్మానించారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులను ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో మాట్లాడిన బండారు దత్తాత్రేయ గారు, తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్గా ప్రొ.కోదండరాం గారు పోషించిన పాత్రను ప్రత్యేకంగా కొనియాడారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలు, ఆశయాలకు ప్రతిరూపంగా ప్రొ.కోదండరాం గారు నిలిచారని పేర్కొన్నారు.అనంతరం ప్రొ.కోదండరాం గారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రొ.కోదండరాం గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం వెనుక ఎటువంటి కార్పొరేట్ శక్తులు లేవని, అది సాధారణ ప్రజలు చేసిన అసాధారణ ఉద్యమమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రజల పక్షాన నిరంతరం కృషి చేస్తామని తెలిపారు..
_______________________